Pinnelli Ramakrishna Reddy | మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈవీఎంల ధ్వంసంతో పాటు ఎన్నికల రోజు దాడులకు పాల్పడటం, ఇతరత్రా నాలుగు కేసుల విషయంలో నిన్న పిన్నెల్లిని అరెస్టు చేసిన పోలీసులు.. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. మొత్తం నాలుగు కేసులకు సంబంధించి విచారణ జరగ్గా.. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. మరో రెండు కేసులకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నరసరావుపేట ఎస్పీ కార్యాలయం వద్ద నుంచి పిన్నెల్లిని భారీ బందోబస్తు మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసి కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
కానీ ఈ కేసుల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఇన్నిరోజులు ఆరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ బెయిల్ను హైకోర్టు బుధవారం రద్దు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయన్ను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.