రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. మా హయాంలో జరిగిన కార్యక్రమాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ హామీలపై ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు.
అనుభవం ఉన్న చంద్రబాబును ఎన్నుకుంటే పరిపాలన బాగా చేస్తారని ప్రజలు భావించారని మాజీ మంత్రి కాకాణి అన్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని.. ఇక మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే 60 శాతం ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సమీక్షించుకుంటామని చెప్పారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. నేతలో కలిసి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
టీడీపీ చోటా నాయకుల ఉడుత బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది సమంజసమని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం నిర్వీర్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు గెలిచిన తర్వాత పింఛన్ల గురించి తప్పితే మరే పథకం గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. తనకు పదవి ఉన్నా, లేకున్నా సర్వేపల్లి నియోజకవర్గ ఇంటి బిడ్డనే అని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశామని.. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరగకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు.