Gudivada Amarnath | కూటమి ప్రభుత్వ హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ మొదలుపెడతామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా విశాఖ ఎండాడలోని వైసీపీ కార్యాలయంలో గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో వైఫల్యాలు, నేతల తీరుపై చర్చించారు. అలాగే వైఎస్ఆర్ జయంతి నిర్వహణపై కూడా చర్చించారు.
అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే వైఎస్ జగన్ సమీక్ష మొదలుపెట్టారని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులతో సమావేశాలు పెట్టే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నామని పేర్కొన్నారు. వైసీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు అండగా వైఎస్ జగన్ నిలబడతారని స్పష్టం చేశారు.
వైసీపీ కార్యకర్తలు, నాయకుల కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మేనిఫెస్టోలని 99 శాతం హామీలను అమలు చేసిన వైసీపీపై ప్రజల్లో అభిమానం ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిన తర్వాత తమ యాక్షన్ ఉంటుందని స్పష్టంచేశారు.