Margani Bharat | రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది. మార్గాని భరత్ వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడు దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆధారాలతో సహా నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.
జూన్ 28వ తేదీ అర్ధరాత్రి 11-45 గంటల ప్రాంతంలో వీఎల్ఫురంలోని మార్గాని ఎస్టేట్స్ కార్యాలయంలో ఉన్న ప్రచార రథం దగ్ధమైంది. ఇది అధికార టీడీపీ శ్రేణుల పనే అని తాను అనుకుంటున్నట్లుగా మార్గాని భరత్ అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శివాజీగా తాజాగా గుర్తించారు. దీంతో తమపై ఆరోపణలు చేసిన మార్గాని భరత్పై టీడీపీ విమర్శలు గుప్పించింది. కాగా, ఎన్నికల్లో ఓడిపోయిన భరత్ తమను టార్గెట్ చేసేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపాడని టీడీపీ ఆరోపిస్తుంది. సానుభూతి కోసమే ఇలాంటి కుయుక్తులు పన్ని.. అడ్డంగా దొరికిపోయాడని విమర్శించింది.
తన ప్రచార రథాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని బయటపడటంతో మార్గాని భరత్ స్పందించారు. ప్రచార రథం దగ్ధం కేసులో సమగ్ర విచారణ జరిపించాలని మార్గాని భరత్ కోరారు. టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నిందితుడిని తమ వద్దకు పంపించి కోవర్ట్ ఆపరేషన్ చేసిందని ఆరోపించారు. శివాజీ అనే వ్యక్తి నెల క్రితమే వైసీపీలో చేరారని తెలిపారు. శివాజీని తన తండ్రికి ప్రధాన అనుచరుడు అనడం సరికాదని చెప్పారు. శివాజీ గతంలో టీడీపీ సోషల్మీడియాలో పనిచేశారని చెప్పారు. నిందితుడి బంధువులంతా టీడీపీకి చెందినవారే అని చెప్పారు. దీనిపై మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమాణానికి సిద్ధమా అని సవాలు విసిరారు.