YS Jagan | ప్రజల్లో వ్యతిరేకత కారణంగా తాము ఓడిపోలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల పది శాతం మంది ఇటు నుంచి అటు వెళ్లారని చెప్పారు. అంతేతప్పితే తమ మీద ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టంచేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైఎస్ జగన్ గురువారం ములాఖత్ అయ్యారు.
నెల్లూరు జైలులో పిన్నెల్లిని ఓదార్చిన అనంతరం బయటకొచ్చిన జగన్ మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్బంధించారని వైఎస్ జగన్ అన్నారు. కారంపూడి ఘటన తర్వాత వారం రోజులకు పిన్నెల్లిపై 307 కేసు పెట్టారని తెలిపారు. నిజంగా దాడి జరిగితే వెంటనే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కారంపూడిలో టీడీపీ అకృత్యాలకు ఎస్సీ కుటుంబం ఇబ్బంది పడిందని అన్నారు. డీఎస్పీ అనుమతితోనే వైసీపీ కార్యకర్తల పరామర్శకు పిన్నెల్లి వెళ్లారని.. అప్పుడు సీఐ నారాయణ స్వామి కనీసం ఆయనకు ఎదురుపడలేదని చెప్పారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ చూడలేదని వైఎస్ జగన్ చెప్పారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి మంచి చేశామని తెలిపారు. కానీ ఈ రోజు కేవలం టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ దొంగ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని.. వైఎస్సార్ విగ్రహాలను తగులబెడుతున్నారని అన్నారు. ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల్లా పెరిగిపోతున్నాయని తెలిపారు. దాడులతో భయపెట్టి చేసే రాజకీయాలు ఎక్కువకాలం నిలబడవని.. ప్రజలే బాబుకు గట్టి జవాబిస్తారని జోస్యం చెప్పారు. ప్రతి గ్రామం, మండల పరిధిలో రెడ్బుక్ల పేరుతో దాడులు చేస్తున్నారని.. టీడీపీ వాళ్లే కొట్టి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు. దాడులను దగ్గరుండి ప్రోత్సహించడం దుర్మార్గమని, ఇలాంటివి వెంటనే ఆపేయాలని హెచ్చరించారు.