తిరుపతి : మానవ నాగరికతకు మూలం మహిళ అని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి ( TTD Chairman Karunakar Reddy) పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి మహతి ఆడిటోరియంలో గురువారం మహిళా దినోత్సవ ( Womens Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాణాల ప్రకారం ఆదిదేవత మహిళ అన్నారు. చరిత్రలో అనేక మంది రాణులు రాజ్యపాలన సక్రమంగా నిర్వర్తించారని వెల్లడించారు.
ఆధునిక కాలంలో సిరిమావో బండారు నాయకే, ఇందిరాగాంధీ(Indira Gandhi) , మార్గరెట్ థాచర్ లాంటి మహిళామణులు దేశ ప్రధానులుగా తమదైన ముద్ర వేశారని చెప్పారు. భారతీయ సమాజం మొదట్లో మాతృస్వామిక వ్యవస్థగా ఉండేదని, క్రమంగా పితృస్వామిక వ్యవస్థగా మారిందని వివరించారు. వర్తమాన సమాజంలో మహిళలు ఆయా రంగాల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ముందుకు వెళ్తున్నారని తెలిపారు.
పురుషాధిక్య సమాజంలో ఉన్న మహిళలు జ్ఞానానికి మరింత పదును పెట్టాలని, ఇందుకోసం పాఠ్యపుస్తకాలతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని అందించే పుస్తకాలను అధ్యయనం చేయాలని సూచించారు. టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ హైందవ సనాతన సంస్కృతిలో మహిళలకు విశేషమైన స్థానం ఉందని చెప్పారు. టీటీడీ ఉద్యోగినులు తమ ఇంటిని చక్కబెట్టుకున్న విధంగానే, సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయడానికి కృషి చేయాలని కోరారు.
పద్మావతి అవార్డుల ప్రదానం..
టీటీడీలోని వివిధ విభాగాల్లో విశేష సేవలు అందిస్తున్న 20 మంది మహిళా ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ పద్మావతి అవార్డులు ప్రదానం చేశారు. వీరిని శాలువతో సన్మానించి 5 గ్రాముల వెండి డాలర్, పద్మావతి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.