హైదరాబాద్, జూలై 2 (నమస్తేతెలంగాణ): నల్లమల అడవుల్లో 150 ఏండ్ల నుంచి కనిపించని అడవి దున్న (ఇండియన్ బైసన్) మళ్లీ ప్రత్యక్షమైంది. నెల రోజుల కిందట ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు.
వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్లో అడవిదున్న కనిపించింది. నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఇనేండ్ల తర్వాత అడవిదున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమేనని తెలిపారు.
పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమేనని, ఈ అడవి దున్న మైదానాన్ని దాటుకుని నల్లమల చేరి ఉంటుందని వెల్లడించారు.