Vangaveeti Radha | ఏపీలో ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు పదవుల కోసం జరగలేదని.. ప్రజల కోసం జరిగాయని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని పేర్కొన్నారు. తన తండ్రి వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులో ఆయన విగ్రహానికి వంగవీటి రాధా నివాళులు అర్పించారు.
అనంతరం వంగవీటి రాధా మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ఎలా బుద్ధి చెబుతారో ఈ ఎన్నికల్లో చూశామని వ్యాఖ్యానించారు. అందరం కష్టపడి పనిచేసేది, చేసింది ప్రజల క్షేమం కోసమే అని తెలిపారు. ఈ ఎన్నికలు బేరసారాల కోసమో, పదవుల కోసమే జరిగినవి కావని తెలిపారు. ప్రజల కోసం జరిగిన ఎన్నికలు అని పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని స్పష్టం చేశారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే తన తండ్రి రంగా ఆశయమని తెలిపారు. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తామన్నారు.