ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. కూటమిలో కీలక పాత్ర ఉండటంతో ఎలాగైనా ప్రత్యేక హోదాకు ఒప్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒత్తిళ్లు మొదలయ్యాయి. కానీ ఇలాంటి తరుణంలో ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమే అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మరోసారి పునరుద్ఘాటించారు.
కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానంపై కూడా ఆయన స్పందించారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమనేది తీర్మానాలు చేసి నిర్ణయించే అంశం కాదని తెలిపారు. ప్యాకేజీ నిధుల ద్వారా ఏపీ అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా పోలవరంలో సమస్యలు తలెత్తాయని కేంద్రమంత్రి ఆరోపించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. దాని నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలా? లేదంటే కేంద్రం బాధ్యత తీసుకోవాలా? అనేది కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయిస్తుందని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలు కొలిక్కి రావడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గత పరిస్థితుల కారణంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.