Vijayawada | విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను యనమలకుదురు కట్ట మీద తగలబెట్టేందుకు ఇద్దరు యువకులు ప్రయత్నించారు. అనుమానంతో స్థానికులు ప్రశ్నించడంతో కారులో అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని పట్టుకున్నారు. వీరిలో ఒకర్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు.
మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా ధ్వంసం చేసేందుకు డ్రైవర్ నాగరాజు ప్రయత్నించారు. రామారావు అనే యువకుడితో కలిసి కారులో యనమలకుదురు కట్ట వద్దకు వచ్చిన నాగరాజు.. బస్తాల్లో తీసుకొచ్చిన రికార్డులను తగులబెట్టాడు. ఇది గమనించిన స్థానికులు అనుమానంతో వారిని నిలదీశారు. దీంతో భయపడిపోయిన నాగరాజు, రామారావు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఈ ఘటనలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన పలు పత్రాలు, హార్డ్ డిస్క్లు, లెటర్ హెడ్స్, క్యాసెట్స్ దగ్ధమయ్యాయి.
స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పెనమలూరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పీసీబీ మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకే తాను పత్రాలు తగులబెట్టినట్లు నాగరాజు వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఫైల్స్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకు తగులబెట్టారు? అనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.