హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. పోలవరం ప్రాజెక్టు సమస్యలపై అధ్యయనం చేసేందుకు 4 రోజులపాటు ఆ ప్రాంతంలో పర్యటించిన ఈ బృందం.. తొలిరోజు అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, స్పిల్వేలను, రెండోరోజు డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించింది.
డయాఫ్రం వాల్పై అనుమానం వచ్చిన ప్రతిచోటా కాంక్రీట్, మట్టి నమూనాలు సేకరించింది. అనంతరం కేంద్ర, రాష్ట్ర అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. బంకమట్టిపై ఎకడైనా నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే అవి పటిష్ఠంగా ఉంటాయా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇచ్చింది. అలాంటి ప్రాంతాల్లో నిర్మాణాలకు కూడా ఢోకా ఉండదని తెలిపింది.
అమెరికాకు చెందిన జియాన్ ఫ్రాంకో డీ సికో, డేవిడ్ బీ పాల్, కెనడాకు చెందిన సీన్ హించ్ బర్గర్, రిచర్డ్ డోనెల్లీతో కూడిన ఈ బృందాన్ని చివరిరోజు స్థానిక రైతులు కలిసి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మా ణ అంశాల్లో నిపుణులైన ఈ నలుగురు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.