YS Jagan | వైఎస్ జగన్ మరోసారి సీఎం కావడం కలలో కూడా జరగదని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని.. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాలు విసిరారు. తిరుపతిలో కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాలో జనసేన చివరి ప్రెస్మీట్ ఇదేనని.. 96 గంటల తర్వాత ఏపీ ప్రజలు కూటమిని గెలిపించారని దేశం మొత్తం తెలుస్తుందని అన్నారు.
వైజాగ్లో జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణస్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తానని కిరణ్ రాయల్ చెప్పారు. తిరుపతి నుంచి వెళ్లి మరీ జగన్కు స్వాగతం పలుకుతానని తెలిపారు. ట్రైన్లు బుక్కయిపోయాయి.. లాడ్జిలు ఫుల్ అయిపోయాయి, సముద్రం ఫుల్ అయిపోయిందంటున్నారని వైసీపీ నేతల్ని ఎద్దేవా చేశారు. ఒకవైపు రోమ్ నగరం తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా.. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ తగలబడుతుంటే.. సజ్జల భజన చేస్తున్నారని సెటైర్ వేశారు. బెట్టింగ్ల పేరుతో సజ్జల మోసం చేస్తున్నారని ఆరోపించారు. నగరిలో రోజా గెలుస్తారని దమ్ముంటే బెట్టింగ్ కట్టగలరా అని సవాలు విసిరారు.