అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఐదేండ్ల పాటు ముఖ్యమంత్రి(Chief Minister) గా తప్పించుకున్నావని, ఇక ఏ పదవి లేనందున జైలుకు వెళ్లడం ఖాయమని ఆరోపించారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలు(Jail) లో వైఎస్ జగన్ గురువారం మిలాఖతయ్యారు. అనంతరం చంద్రబాబు(Chandra babu) పై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. రాష్ట్రంలోని 16 శాతం మంది ఓటర్లు టీడీపీ, బీజేపీ, జనసేనకు అధికంగా ఓటేసి గెలిపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజల్లో సానుభూతి సంపాధించుకోవడం కోసం అధికార పార్టీపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.21 రోజుల్లోనే ప్రభుత్వం ఏమీ చేయలేదని జగన్ మాట్లాడటం సిగ్గుచేటని ఆరోపించారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 5 కీలక హామీలపై సంతకం పెట్టారని తెలిపారు. మొదటి తేదీన 28 రకాల పింఛన్లు పంపిణీ చేయడం వల్ల వృద్ధులు,దివ్యాంగులు, వితంతువుల మొఖాల్లో చిరునవ్వును చూశామని అన్నారు. జగన్ సంఘ విద్రోహ శక్తి, రౌడీని పరామర్శించడం సిగ్గుచేటని విమర్శించారు .