అమరావతి : గత ప్రభుత్వ పాలనలో వైసీపీతో అంటకాగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరికి బాధ్యతలు అప్పగించకుండా సాధారణ పరిపాలన శాఖ(GAD) కు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది .
పులివెందుల (Pulivendula) ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ బి. అనిల్ కుమార్రెడ్డి(Anil kumar reddy) , సంప్రదాయేతర ఇంధన వనరులు కార్పొరేషన్ ఎండీ నంద కిషోర్, ఏపీ ఇన్ఫ్రాక్చర్ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీ నీలకంఠా రెడ్డిని బదిలీ చేస్తూ పరిపాలన శాఖకు అటాచ్ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చంద్రబాబు (Chandra Babu) ప్రభుత్వం కీలక అధికారులను బాధ్యతల నుంచి తప్పించింది.
ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) సీనియర్ అధికారులను బదిలీ చేయగా మరికొందరు పదోన్నతుల అవకాశం కల్పించింది. చీఫ్ సెక్రటరి జవహార్రెడ్డిని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలను తప్పించి వారి స్థానంలో నీరబ్కుమార్ ప్రసాద్, ద్వారకా తిరుమలరావుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మితో పాటు మరికొందరు అధికారులను జీఏడీకి బదిలీ చేశారు. కీలక శాఖలకు పాత అధికారులను తొలగించి సమర్ధులైన అధికారులను నియమించారు.