హైదరాబాద్, జూన్ 28 (నమస్తేతెలంగాణ):తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం విజయవాడలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. పెండింగులో ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం. ఆ తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని గవర్నర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని, ఇరు రాష్ర్టాల విభజన అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని వివరించారు. అమ్మవారి దర్శనం కోసమే తా ను విజయవాడకు వచ్చానని చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేశామని, 2019 తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని చంద్రబాబు వివరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు జాప్యంతో రైతులకు రూ.45 వేల కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. జగన్ సర్కారు అసమర్థతతో పోలవరంలో గైడ్బండ్ కుంగిందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని తెలిపారు. వీటి మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పించనున్నామని చెప్పారు.