TTD | శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో కాలి నడకన వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను టీటీడీ ఈఓ శ్యామలరావు ఆదేశించారు. టీటీడీ పద్మావతి గెస్ట్ హౌస్ లో మంగళవారం జరిగిన సమావేశంలో కాలిబాట భక్తుల భద్రతా చర్యలపై ఆయన సమీక్షించారు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు, ఇతర జంతువుల సంచారాన్ని గుర్తించడానికి ఇప్పుడు ఉన్న ట్రాప్ కెమెరాలతోపాటు మరికొన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
లక్ష్మీ నర్సింహాస్వామి ఆలయం నుంచి ఏడవ మైల్ వరకూ జంతువుల కదలికలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగు పర్చాలని ఇంజినీరింగ్ అధికారులను శ్యామలరావు ఆదేశించారు. జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి సమాచారం తెలియజేడయంతో భక్తులను హెచ్చరించడానికి అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు ఖర్చుతో కూడుకున్నవి కనుక తక్కువ ఖర్చుతో నిర్మాణాలు చేపట్టేందుకు ఆల్టర్నేటివ్ మార్గాలను సూచించాలని సంయుక్త కమిటీ ప్రతినిధులకు లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల కాలిబాట మార్గంలో ఏయే సమయాల్లో చిరుతలు తిరుగుతున్నాయన్న సమాచారాన్ని పీపీటీ ద్వారా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాలిబాట భక్తులు నిర్దేశిత సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా ఆయా సమయాల్లో మార్పులు చేయాలని ఈవోను కోరారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని జేఈఓ వీరబ్రహ్మం, సీవీ అండ్ ఎస్ఓ నరసింహ కిశోర్ లకు సూచించారు.అంతకు ముందు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను సమావేశంలో అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.