Srisailam | శ్రీశైల దేవస్థానానికి రూ.3,98,34,583 ఆదాయం లభించిందని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. గత నెల ఆరో తేదీ నుంచి ఈ నెల మూడో తేదీ వరకూ శ్రీశైల దేవస్థానం పరిధిలోని దేవాలయాల్లో గల హుండీలో వచ్చిన కానుకలను గురువారం లెక్కించారు. హుండీలో 148 గ్రాముల బంగారం, 6.260 కిలోల వెండి లభించాయని పెద్దిరాజు చెప్పారు. అలాగే 835 యూఎస్ డాలర్లు, 30 యూరోలు, రెండు ఓమన్ రియాల్స్, రెండు ఖతార్ రియాల్స్, 105 కెనడా డాలర్లు, రెండు సింగపూర్ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 55 యూఏఈ దిర్హామ్స్, 20 సౌదీ అరేబియా రియాల్స్, 106 మలేషియా రింగిట్స్, 80 థాయిలాండ్ బాట్స్ తదితర విదేశీ కరెన్సీని కూడా హుండీల్లో భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల నిఘా మధ్య హుండీలను లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు, డిప్యూటీ ఈఓ రమణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం దేవస్థానానికి హైదరాబాద్ లోని ఎక్సెల్లా కంపెనీ చైర్మన్ అరవింద్, వనమాల వేణు గురువారం పలు రకాల ఔషధాలను విరాళంగా అందచేశారు. ఈ మేరకు దేవస్థానం దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న అపోలో వైద్యులు శశిధర్ రావు, కిషన్ లకు ఈ ఔషధాలను అందజేశారు. జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు, గుండె సంబంధ వ్యాధుల నివారణకు అవసరమైన ఔషధాలను అంద చేసినట్లు దాతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అందజేసిన ఔషధాల విలువ సుమారు రూ.2 లక్షల వరకూ ఉంటుందన్నారు.