Tirumala | తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికి అయినా సిద్ధమని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి పునరుద్ఘాటించారు. తిరుమలలో మఠాలు ముఠాలుగా మారాయని ఆయన ఆరోపించారు. తిరుమలలోని విశాఖ శారదా పీఠాన్ని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు ఉల్లఘించి విశాఖ శారదా పీఠం కట్టడాలు జరిగాయని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. వాగు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని విమర్శించారు. పీఠాల పేరుతో దళారీలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలలో అన్నీ వ్యాపారంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వెంటనే తిరుమలను ప్రక్షాళన చేయాలని కోరారు. దళారీలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్యలు తీసుకోకపోతే దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఇటీవల ఏపీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శారదా పీఠం నిర్మిస్తున్న రెండు భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిపిందే. కాగా, తిరుమలలో విశాఖ శారదా పీఠం అక్రమాలపై కొద్దిరోజులుగా శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని విమర్శించారు. నాలుగు అంతస్తులకు అనుమతి ఇస్తే.. అక్కడ ఆరు అంతస్తుల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. గదులను భక్తులకు అధిక ధరలకు కేటాయిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని అన్నారు. 10 వేల చదరపు గజాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారని పేర్కొన్నారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు.
తిరుమలలో శారదాపీఠం ఆక్రమణలపై జనసేన నేత కిరణ్ రాయల్ కూడా కొద్దిరోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన ఇటీవల ఆరోపించారు. శారదా పీఠం వెనుక ఫైవ్స్టార్ హోటళ్లను తలపించే నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మఠాలను అద్దెకు తీసుకుని భక్తుల నుంచి వైసీపీ నాయకులు భక్తుల నుంచి లక్షలు సంపాదించారని మండిపడ్డారు.