Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్ర స్వామికి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో ఈ విశేషార్చన జరిపించారు. ఈ అమావాస్య నాడు భక్తులు కూడా పరోక్ష సేవగా ఈ అర్చన జరిపించుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. శుక్రవారం పరోక్ష సేవ ద్వారా 18 మంది భక్తులు ఈ విశేష పూజలు జరిపించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల నుంచి భక్తులు శుక్రవారం విశేష పూజ జరిపించారు. ఈ పూజాధికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ నిర్వహించారు. ఈ పూజాధికాల్లో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో వీరభద్రస్వామికి అభిషేకం జరిపించారు.
శ్రీబయలు వీరభద్రస్వామి ఆరాధన వల్ల గ్రహ దోషాలు నివారించబడతాయి, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కారం అవుతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభించి, అబీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొన్నారు. ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించడానికి వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం తదితర వివరాలను ఎప్పటికప్పుడు సేవాకర్తలను తెలియచేశారు. సేవాకర్తలతోపాటు భక్తులందరూ కూడా వీటిని శ్రీశైల టీవీ లేదా యూ-ట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తారు. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని శ్రీశైల దేవస్థానం ఈఓ పెద్దిరాజు తెలిపారు.