తిరుపతి : టీటీడీ అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో జరగనున్న విశేష ఉత్సవాల (Special festivals) వివరాలను టీటీడీ అధికారులు (TTD Officials) వెల్లడించారు. జూలై 4 నుంచి 14వ తేదీ వరకు నారాయణ వనంలో పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavam) జరుగుతాయని తెలిపారు.
జూలై 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు, 16 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం, 17 నుంచి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని సిద్ధేశ్వర స్వామి , చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
జూలై 18 నుంచి 20వ తేదీ వరకు తిరుపతి(Tirupati) లోనిశ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు, 18 నుంచి 22వ తేదీ వరకు విఖనశాచార్య ఉత్సవాలు, 21న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, 26న సిద్ధేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి ఆలయాల్లో వార్షిక పుష్పయాగాన్ని వైభవంగ నిర్వహిస్తామని తెలిపారు. 29న ఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం ప్రారంభం, 30న తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ , 31న సర్వ ఏకాదశి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
వైభవంగా వకుళా మాత ఆలయ వార్షికోత్సవం
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్నవకుళా మాత ఆలయంలో ఆదివారం వార్షికోత్సవ ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షబందనం, అగ్ని ప్రతిష్ట, కలశారాధన, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకాన్ని నిర్వహించారు.