AP News | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పందించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. వైసీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి తమ పార్టీకి టచ్లో లేరని.. వాళ్లను తాము ఆహ్వానించమని స్పష్టం చేశారు. వాళ్లను పార్టీలో చేర్చుకునే ఆలోచనే లేదని కుండబద్ధలు కొట్టారు.
ఇక ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్ జగన్తో పాటు వైసీపీ నేతలు చెప్పడంపై కూడా సోము వీర్రాజు స్పందించారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అహంకార ధోరణి మారట్లేదని విమర్శించారు. ఎమర్జెన్సీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అదే తీరు కనబరుస్తుందని.. ఇప్పుడు పార్లమెంటులో కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీకి టచ్లో ఉన్నారని మొదటగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి స్వయంగా కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని బాంబు పేల్చారు. అయితే బీజేపీ నాయకత్వం వారిని అక్కర్లేదని చెప్పిందని, అయినప్పటికీ మిథున్ రెడ్డి ఇంకా లాబీయింగ్ నడిపిస్తున్నారని చెప్పారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల తర్వాతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జోరందుకుంది.