అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే అధికార టీడీపీ(TDP) కి చెందిన ఓ ఎమ్మెల్యే తన పదవి, రాజకీయాలపై అనాసక్తిని ప్రదర్శించాడు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు పదవి ఎందుకు. నాలాంటి వాడు రాజకీయాల్లో అవసరం లేదంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు (Chandra Babu) కు కంగారు పుట్టించాయి. వెంటనే అతడి నుంచి వివరణ కోరి సర్ధి చెప్పడంతో ఆ అంశం అక్కడితో ముగిసింది. అసలు ఏం జరిగిందంటే.
ఎన్టీఆర్ జిల్లా(NTR District) తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మంగళవారం భవన నిర్మాణం కూల్చివేత అంశం రచ్చకు దారి తీసింది. ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ(YCP) కి చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు అక్రమంగా భవనం కడుతున్నారని బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు భవనం వద్దకు అనుచరులు, బుల్డోజర్, ప్రోక్లెయిన్తో వెళ్లిన ఎమ్మెల్యే నానా యాగి చేశారు.
పోలీసులు, అధికారులు వచ్చి చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పినా వినకుండా భవనాన్ని పాక్షికంగా ధ్వంసానికి కారకుడయ్యాడు. ఎమ్మెల్యే వ్యవహారశైలి చర్చకు దారితీయడంతో చివరకు బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, అతడి అనుచరులపై బుధవారం కేసు నమోదు అయ్యింది . తనపైనే కేసు నమోదు కావడం పట్ల అసహనానికి గురయ్యారు.
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికారుల వ్యవహారంలో మార్పు రావడం లేదని, స్వయంగా నేను చెప్పినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవి శాశ్వతం కాదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వ్యాఖ్యలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు పిలుపించుకుని మాట్లాడారు. చట్ట పరిధిలో దోషులను శిక్షిద్దామని, క్షేత్ర స్థాయికి వ్యక్తిగతంగా వెళ్లవద్దని సూచించారు.