తిరుపతి: రాయలసీమ ప్రాంతంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నీటి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే వెనుకబడిన ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను అందేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ మేధావుల వేదిక (ఆర్ఐఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆర్ఐఎఫ్ కన్వీనర్ ఎం పురుషోత్తంరెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం డ్యామ్లో నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలకుగానూ 200 టీఎంసీల దిగువకు పడిపోయిందని, కృష్ణా నది నుంచి ఏటా అపారమైన నీరు వృథాగా పోతున్నదని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి గుండ్రేవుల ప్రాజెక్టు పనులను చేపట్టడం ద్వారా తుంగభద్ర నది నుంచి మరిన్ని జలాలను వినియోగించుకునే అవకాశాలను అన్వేషించాలని సూచించామన్నారు. అలాగే, కుందూ నదిపై ప్రాజెక్టు, రాజోలు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల పూర్తికి మరిన్ని నిధులు విడుదలయ్యేలా చూడటంతోపాటు చిత్తూరు జిల్లా ఎదుర్కొంటున్న నీటి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని ఫోరం నొక్కి చెప్పిందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులన్నింటినీ ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలని కోరినట్లు పురుషోత్తం రెడ్డి తెలిపారు.