Vangalapudi Anitha | రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికి మాత్రమే అని స్పష్టం చేశారు. వైజాగ్ సీపీ కార్యాలయంలో డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో గురువారం హోంమంత్రి అనిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోషల్మీడియాలో నేటికీ నేనూ బాధితురాలినే అని చెప్పారు. అసభ్య పోస్టులపై విచారణ చేసిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కలిసికట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తీసుకొస్తామని హోంమంత్రి అనిత అన్నారు. ప్రజలు ధైర్యంగా స్టేషన్కు వెళ్లి బాధలు చెప్పుకునేలా భరోసా ఇవ్వాలని సూచించారు. మహిళల మిస్సింగ్ కేసులపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ భద్రతగా, భరోసాగా ఉండేలా చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొచ్చినప్పటికీ పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. నేటికి విశాఖ జిల్లాలో ఒక పీఎస్ రేకుల షెడ్డులోనే నడుస్తోందని తెలిపారు. విశాఖలో సీపీ కార్యాలయం తాకట్టులో ఉందన్నారు. ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్లులో ఉన్నాయని చెప్పారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల సీసీ కెమెరాలు, ప్రింట్ స్కానర్లు పనిచేస్తలేవని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు.
హోంశాఖకు ఎన్ని నిధులు అవసరమో నివేదిక సిద్ధం చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తూ ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. రిక్రూట్మెంట్ జరగాలని.. నిధుల కేటాయింపుతో అన్నీ చేస్తామని చెప్పారు.