తిరుపతి : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామల రావు (TTD EO Shyamala Rao) అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో సమీక్షించారు. తిరుమల (Tirumala) లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, విక్యూసీలోని అక్షయ కిచెన్, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు (Annapradadam) తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు.
పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. తిరుమల, తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 1. 92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని అధికారులు ఈవోకు వివరించారు. ఒక రోజున అన్నప్రసాదం కోసం రూ.38 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా కూరగాయల దాతలు, ఒకరోజు విరాళం పథకం తదితర అంశాలపై కూడా ఈవో సమీక్షించారు. భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు సూచించారు.