Poonam Kaur | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో వైసీపీ ముందుకెళ్లింది. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూపుతూ జగన్ ప్రచారం చేశారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం జగన్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి 164 స్థానాలు ఇవ్వగా.. వైసీపీని కేవలం 11 స్థానాల్లోనే గెలిపించారు. దీంతో అసలు ఎక్కడ మోసం జరిగిందో తెలియక వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయంపై సినీ నటి పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూనమ్ కౌర్ మొదట్నుంచి కూడా ఏపీలో వైసీపీకి సపోర్టు చేస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం వెనుక ముగ్గురు మహిళలు ఉన్నారని పూనమ్ కౌర్ తెలిపారు. జగన్ వాళ్ల అమ్మ, చెల్లె, భార్య వైఎస్ భారతి ముగ్గురు కూడా తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు వారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నా అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైసీపీ అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఫ్యామిలీ సపోర్టు లేకుండా ఏమీ చేయలేమని.. వైఎస్ జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోయి బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
The architects of #ysjaganmohanreddy garu’s previous success were the three important women of his life , his mother , his sister , his wife YS Bharathi garu who truly teaches patience and perseverance in her own ways , I wish the entire family togetherness , love and peace ✌️ 🙏
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 7, 2024
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు చాలా రోజుల నుంచే వైఎస్ జగన్, షర్మిల మధ్య విబేధాలు మొదలయ్యాయి. బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్కు వ్యతిరేకంగా పలు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. తన సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డిపై కడప నుంచి ఆమె స్వయంగా పోటీ చేశారు. ఈ పరిణామాలు అన్నీ కూడా వైఎస్ జగన్ ప్రతిష్ఠను మసకబార్చాయని… ఏపీ ఎన్నికల్లో ఓటమికి కూడా కొంత మేర కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.