అమరావతి : ఏపీలోని ఏలూరు(Eluru) జిల్లాలో విద్యుదాఘాతం (Electrocution ) తో తల్లికొడుకు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. జిల్లాలోని ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో గురువారం తడి బట్టలు తీగలపై ఆరేస్తుండగా తల్లీ దొండపాటి నాగరత్నం, ఆమె కుమారుడు రామదాసుకు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) కేసు నమోదు చేసి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
పల్నాడు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని వినుగొండ మండలం కొత్తపాలెం వద్ద అతి వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టింది. గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన టీటీడీ విశ్రాంత ఉద్యోగి సోమసి బాలగంగాధర్ శర్మ కుటుంబం కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు ఇన్నోవా కారులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బాలగంగాధర్ శర్మ, ఆయన సతీమణి యశోద, కారు డ్రైవర్ మృతి చెందారు. బాల గంగాధర్ శర్మ కుమారుడు హెచ్ఎస్వై శర్మ, ఆయన భార్య నాగ సంధ్య, వీరి పిల్లలు కార్తిక్, అనుపమ గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.