Kandula Durgesh | గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో దుర్మార్గాలు జరిగాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అరోపించారు. గత ప్రభుత్వానికి టూరిజం శాఖ అధికారులు అనుకూలంగా వ్యవహరించి.. భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో కందుల దుర్గేశ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో పర్యాటకం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు.
పులివెందులలో ఫోర్స్టార్ హోటల్ పేరుతో సొంత మనుషులకు నిధులు దోచిపెట్టారని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. అసలు పులివెందులకు పర్యాటకులు ఎవరైనా వెళ్తారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన దొంగలు ఇంకా ఉన్నారని.. పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టూరిజం రంగానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. ఆయన ఉండగా ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో సినిమా రంగానికి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.