Pinnelli Ramakrishna Reddy | మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై దాడి చేసినందుకు ఆయనపై ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన అనంతరం మాచర్ల కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో తనను కడుపులో పిడికిలితో బలంగా గుద్దినందుకు కొమర శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.
పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసి కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
కానీ ఈ కేసుల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఇన్నిరోజులు ఆరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ బెయిల్ను హైకోర్టు బుధవారం రద్దు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయన్ను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అలా కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో పిన్నెల్లికి అడ్డంగా కొమర శివ వచ్చాడు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యానికి దిగి.. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించాడు. దీంతో ప్రతిఘటించిన పిన్నెల్లి.. కొమర శివను కడుపులో గట్టిగా గుద్దాడు.
కాగా, ఈవీఎంల ధ్వంసంతో పాటు ఎన్నికల రోజు దాడులకు పాల్పడటం, ఇతరత్రా నాలుగు కేసులపై బుధవారం రాత్రి విచారణ జరిపిన మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి.. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. మరో రెండు కేసులకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, ఇప్పుడు పిన్నెల్లిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం.