తిరుమల : తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో తిరుమంజనం (Koil Alwar Thirumanjanam ) నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని టీటీడీ (TTD) అర్చకులు తెలిపారు. సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయ శుద్ధిని నిర్వహిస్తామన్నారు.
శ్రీనివాసమంగాపురంలో వైభవంగా తిరుమంజనం
తిరుపతి : శ్రీనివాసమంగాపురం(Srinivasa Mangapuram) కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 10 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించి ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.
సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10న పెద్దశేష వాహనం, 11న హనుమంత వాహనం, 12న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.