తిరుపతి : శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయంలో జూలై 4 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 10 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న సందర్భంగా ఈ ఉత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ( Koil Alwar Thirumanjanam) నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.
గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం అనంతరం ఉదయం 6. 30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామన్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసి సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తామని వివరించారు.
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు. తిరుమంజనం సందర్భంగా జూలై 4న తిరుప్పావడసేవ (Tiruppavada Service) , ఆర్జిత కల్యాణోత్సవం సేవను రద్దు చేసినట్లు టీటీడీ(TTD) అధికారులు వివరించారు.