Atchutapuram | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో మరణించిన హారిక కథ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా సోదరులతో ఆనందంగా గడిపేందుకు వచ్చిన ఆమె.. ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్నా బతికి ఉండేది. కానీ ఆ ఒక్కరోజు యాజమాన్యం సెలవు ఇవ్వకపోవడంతో దిగులుగానే ఫ్యాక్టరీకి వెళ్లిన ఆమె ప్రమాదంలో కాలి బూడిదయ్యింది.
కాకినాడ అర్బన్ రెండో డివిజన్లోని సౌజన్య నగర్కు చెందిన చర్లపల్లి హారిక కడు పేదరికంలో పుట్టి పెరిగింది. తండ్రి ఈశ్వరరావు పదేళ్ల క్రితమే మరిణించాడు. అన్న కూడా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో తల్లి, నానమ్మలతో కలిసి ఉంటూ కష్టపడి చదువుకుంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 11 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్గా ఫార్మా కంపెనీలో చేరింది.
రక్షా బంధన్ సందర్భంగా పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టేందుకు ఆదివారం నాడు హారిక కాకినాడకు వచ్చింది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. మరొక రోజు తమతో ఉండాలని వారు కోరడంతో బుధవారం సెలవు పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ యాజమాన్యం సెలవు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో విధులకు వెళ్లింది. అదే రోజు ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో శిథిలాల కింద చిక్కుకుని హారిక మరణించింది. దీంతో ఒక్కరోజు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉన్నా తమ బిడ్డ ప్రాణాలతో బతికి ఉండేదని ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.