Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఓఎస్డీగా యువ అధికారి మధుసూదన్ను నియమించారు. ప్రస్తుతం ఆయన కడప ఆర్డీవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ధర్మవరం ఆర్డీవోగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కడపలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు మధుసూదన్ కీలక చర్యలు తీసుకున్నారు. అవి సత్ఫలితాలను కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఏరికోరి పవన్ కల్యాణ్కు ఓఎస్డీగా నియమించారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఓఎస్డీగా నియమితులైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మధుసూదన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
పవన్ కల్యాణ్ ఓఎస్డీగా యువ ఐఏఎస్ కృష్ణ చైతన్యను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఓఎస్డీలుగా గ్రూప్ 1 స్థాయి అధికారులు, ఆర్డీవోలను నియమిస్తుంటారు. కానీ తన తీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ ఐఏఎస్ అధికారి కృష్ణ చైతన్యను ఓఎస్డీగా నియమించాలని పవన్ కల్యాణ్ కోరారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా అనుమతించారు. కానీ కృష్ణ చైతన్య ప్రస్తుతం కేరళ రాష్ట్ర కేడర్లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ చైతన్యను డిప్యూటేషన్పై ఏపీకి పంపించాలని కేరళ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. త్వరలోనే కృష్ణచైతన్య కూడా డిప్యూటేషన్పై వచ్చే అవకాశం ఉంది.
కృష్ణ చైతన్య 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆయన స్వస్థలం. 2017లో కేరళలోని అలప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఆయనకు తొలి పోస్టింగ్ దక్కింది. అతి తక్కువ సర్వీసులోనే ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేసినప్పుడు వదర బాధితులను రక్షించేందుకు కీలకంగా వ్యవహరించారు. 48 గంటల్లో రెండున్నర లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులతో కలిసి భారీ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా, టూరిజం శాఖ డైరెక్టర్గా, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్గా అలప్పుజ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం కృష్ణ చైతన్య త్రిసూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు.