అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డ (Mahesh Chandra Laddha) మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికారుల సేవలను ఉపయోగించుకోవాలనుకుంటున్న సీఎం చంద్రబాబు ఆయనను మళ్లీ ఏపీ కేడర్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఆయనను రాష్ట్ర సర్వీస్లోకి పంపుతూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార వర్గాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించగా, అధికారం చేపట్టిన మరుసటి రోజే డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమలరావును నియమించారు. ఏపీ సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ను నియమించిన విషయం తెలిసిందే.