అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( Chandra Babu)కు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రా (Karthikeya Mishra) నియమితులయ్యారు. ఏపీలో పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, రాజమౌళి(Rajamouli)ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్న 2009 ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి మిశ్రాను డీవోపీటీ ఏపీ సర్వీసుకు పంపింది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏవీ రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తర్ప్రదేశ్(Utterpradesh Cadre) కేడర్ ఐఏఎస్ అధికారి. 2014 టీడీపీ ప్రభుత్వంలో 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎంవోలో కీలకంగా పనిచేశారు. రాజమౌళి ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి పాలనపై దృష్టిపెట్టిన చంద్రబాబు సమర్థులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దృష్టిని సారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, శాంతి భద్రతల అంశంలో సీనియర్ ఐపీఎస్ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు. సీఎంవో కార్యాలయంలోనూ అనుభవం ఉన్న అధికారులను నియమించుకుంటున్నారు.