అమరావతి : ఏపీలో జరిగిన ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్కల్యాణ్కు లేఖలు రాస్తూ వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) ఈసారి డీజీపీకి లేఖ రాశారు. తన పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ మరోసారి తెరపైకి వచ్చారు.
అత్యవసరంగా డబ్బులు కావాలంటూ తన పేరుతో ప్రముఖులకు అగంతకుడు ఫోన్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు (DGP Tirumala Rao) లేఖ రాశారు. గతంలోనూ సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసినా కాని ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు రావడం లేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana)కు చెందిన రాజకీయ నాయకులకు ఫోన్ చేస్తు డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. అగంతకుడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
ఏపీలో జనసేన(Janasena) కు మద్దతుదారుడిగా ఉన్న హరిరామ జోగయ్య అనేకసార్లు పవన్కల్యాణ్కు లేఖలు రాశారు. టీడీపీతో పొత్తుకు ముందు, తరువాత జరిగే పరిణామాలను వివరిస్తూ చంద్రబాబు రాజకీయ కుట్రలకు బలి కావొద్దని సూచనలు చేశారు. పొత్తు అసలు వద్దే వద్దంటూ ఒంటరిగా పోటీ చేయాలని, పొత్తు కుదుర్చుకుంటే సీఎం పదవికాలాన్ని సమభాగాలుగా పంచుకోవాలని లేఖలు రాశారు. అయితే పవన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నా సలహాలు పాటించకపోవడం మీ ఖర్మ అంటూ లేఖలు రాయడం నిలిపివేశారు.