అమరావతి : పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే (Former YCP MLA ) పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. బుధవారం మాచర్లలో అతడిని అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఏపీ హైకోర్టు (AP High Court) లో పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై వాదనలు జరుగగా కోర్టు బెయిల్ పిటిషన్లను రద్దుచేసింది. కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు వెంటనే మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.
మే 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు(Elections) జరిగాయి. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్ (Paalwaigate) పోలింగ్ స్టేషన్కు వెళ్లిన పిన్నెల్లి అక్కడ ఒక ఈవీఎంను నేలకేసి కొట్టారు. ఆ వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో ఇది కాస్త వైరల్ కావడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఎమ్మెల్యే పిన్నెల్లితో పాటుగా అతని అనుచరులను అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఆయన మూడు రోజుల పాటు జాడ తెలియరాకపోవడంతో లుకవుట్ నోటీసులు జారీ చేశారు. అతడి ఆచూకిని తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసే సమయంలో హైకోర్టుకు వెళ్లి పిటిషన్ను దాఖలు చేయడం, హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేయలేదు.
బాధితులు మరోమారు సుప్రీంకోర్టుకు వెళ్లి పిన్నెల్లి బెయిల్ను రద్దు చేయాలని, అతడిని అరెస్టు చేయాలని పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు స్పందించి ఫలితాల రోజున కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లవద్దని ఆదేశించింది. పిన్నెల్లిని జూన్ 5వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5వ తేదీ తరువాత కూడా హైకోర్టు నుంచి బెయిల్ పొందడంతో అరెస్టు అంశం వాయిదా పడుతూ వచ్చింది.
చివరకు బుధవారం జరిగిన వాదనల్లో కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ పిన్నెల్లి వేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. ఈవీఎం ధ్వంసం కేసుల్లో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేయగా, పోలీసుల తరుఫున స్పెషల్ కౌన్సిల్గా న్యాయవాది ఎన్ అశ్వినీకుమార్, ఫిర్యాదుదారు శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.