Buggana Rajendranath | ఏపీ ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రమా లేక సాకు పత్రమా అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని అన్నారు. వైట్పేపర్లో సమస్యలు చెప్పి, వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆశలు నీరుగార్చి చేతులెత్తేసినట్లు ఉందని విమర్శించారు. కాబట్టి ఇది శ్వేత పత్రంకాదని.. సాకు పత్రం మాత్రమేనని స్పష్టం చేశారు.
శ్వేతపత్రంలో అన్నీ సాకులే కనిపిస్తున్నాయని.. మొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ డకౌట్ అయ్యిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ ఇచ్చి హామీలకు రూ.2.50 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారని గుర్తుచేశారు. డేటా లేకుండానే శ్వేతపత్రం విడుదల చేశారా అని ప్రశ్నించారు. మీకు అపారమైన అనుభవం ఉందని కదా ప్రజలు ఎన్నుకున్నది.. మీరే చేతులెత్తేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇందులో ప్రజా భాగస్వామ్యం కావాలని అడగడం ఏంటని నిలదీశారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే రాష్ట్రం అప్పులపాలైందని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పదే పదే మాట్లాడారని.. ఇప్పుడు ప్రభుత్వం అప్పులు చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని బుగ్గన ప్రశ్నించారు. వైసీపీ చేస్తే తప్పు, తాము చేస్తే నెప్పా అని నిలదీశారు. గతంలో కాగ్, ఇతర సంస్థల నివేదికలు అడ్డుపెట్టి అప్పుల గురించి ప్రశ్నించారని, ఇప్పుడు అవే విషయాలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఏడాదికి 21.63 శాతం చొప్పున అప్పులు పెరిగాయని, వైసీపీ పాలనలో 12.9 శాతం మాత్రమే పెరిగాయని గుర్తుచేశారు.
ఏపీ అప్పులపై కేంద్రం ఎప్పుడో క్లారిటీ ఇచ్చిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తుచేశారు. అయినా టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందని అన్నారు. చంద్రబాబు పాలనలో దేశ స్థూల ఉత్పత్తిలో ఏపీ వాటా 4.47 శాతం, వైసీపీ ఐదేళ్ల పాలనలో 4.82 అంటే మీ కంటే ఎక్కువేగా అని ప్రశ్నించారు.
గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే 2.79 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని బుగ్గన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు భయపడుతోందని అన్నారు. అప్పులు చెప్పాల్సి వస్తుందనే బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాత్రం 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెబుతున్నారని ఆరోపించారు. టీడీపీ 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి, గవర్నర్తో 10 లక్షల కోట్లు అని చెప్పించిందని అన్నారు. అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదని విమర్శించారు.