AP News | కంచే చేను మేసిందన్న చెందంగా.. బ్యాంకుల నుంచి భద్రంగా డబ్బును తీసుకెళ్లి ఏటీఎంల్లో నింపాల్సిన ఉద్యోగే దాన్ని దొంగిలించాడు. సెక్యూరిటీ కళ్లు కప్పి పారిపోయిన ఆ ఉద్యోగి.. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు కూడా కొట్టించుకోవడం గమనార్హం. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దానవాయిపేటలో ఈ చోరీ జరిగింది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. 12 గంటల్లోనే నిందితుణ్ని పట్టుకుని జైల్లో పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామానికి చెందిన వాసంశెట్టి అశోక్ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏటీఎంల్లో డబ్బులు డిపాజిట్ చేయడం అతని పని. ఈ క్రమంలోనే ఏటీఎంల్లో మనీ నింపేందుకు హెచ్డీఎఫ్సీ దానవాయిపేట బ్రాంచి నుంచి రూ.2.4 కోట్లు విత్డ్రా చేశాడు. ఈ మొత్తాన్ని 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉంది. అయితే ఆ డబ్బును ఏటీఎంల్లో నింపకుండా సెక్యూరిటీ కళ్లుగప్పి దొడ్డిదారిన పరారయ్యాడు.
ఈ విషయం తెలుసుకున్న హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ యాజమాన్యం రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన రాజమండ్రి వన్టౌన్ పోలీసులు.. ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు చేధించారు. సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించడంతో పాటు.. సంబంధిత టోల్ ప్లాజాలకు అశోక్ ఫొటోలను పంపించడం ద్వారా అశోక్ తన స్వగ్రామం మాచర్లమెట్టకు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేయడంతో పాటు అశోక్ నుంచి రూ.2.20 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, రూ.2.20 కోట్లను కొట్టేసిన అశోక్.. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు కూడా కొట్టించుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.