Duvvada Srinivas | టెక్కలి వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్పై వేటుపడింది. ఆయన్ను ఇన్చార్జి పదవి నుంచి తప్పిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది.
గత కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. టెక్కలిలోని దువ్వాడ శ్రీను ఇంటికి వచ్చిన ఆయన సతీమణి వాణి.. అక్కడే 15 రోజులుగా ఆందోళన చేస్తోంది. దివ్వల మాధురి ట్రాప్లో పడిన దువ్వాడ శ్రీను తనను, తన కుమార్తెలను వదిలేశారని ఆరోపిస్తోంది. తాను దువ్వాడ శ్రీనుతోనే కలిసి ఉంటానని.. ఆయనతో ఆ ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని కోరుతోంది. కానీ వాణి మాటలను దువ్వాడ శ్రీను, దివ్వల మాధురి ఇద్దరూ ఖండిస్తూనే ఉన్నారు.
వాణితో లీగల్గానే తేల్చుకుంటానని దువ్వాడ శ్రీను ఖరాఖండీగా చెబుతున్నారు. తన కూతుళ్లకు తండ్రిగా ఇప్పటికే చాలా చేశానని.. వాళ్ల పేరు మీద మరో 29 కోట్ల ఆస్తులు రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కానీ టెక్కలిలోని ఇంటిని మాత్రం ఇవ్వనని తేల్చి చెప్పారు. ఇలా దువ్వాడ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుండటంతో ఆయన్ను టెక్కలి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.