Pawan Kalyan | ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. అమరావతిలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామని పేర్కొన్నారు.
బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆట బొమ్మలుగా మార్చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. పాలన ఎలా ఉండకూడదనే దానికి గత ఐదేళ్ల ప్రభుత్వ తీరు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఒకేరోజు రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని అన్నారు.
కలెక్టర్ల వ్యవస్థను గత ప్రభుత్వం ఆట బొమ్మలను చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశామని గుర్తుచేశారు. గతంలో ఏపీలో పనిచేయాలంటే గర్వపడ్డవాళ్లు.. ఇప్పుడు అవమానపడే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఉపాధి హామీ పనులు అమలు చేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛ భారత్, తాగునీరు గ్రామ రహదారుల నిర్మాణంపై మీ సహకారం కావాలని కలెక్టర్లను విజ్ఞప్తి చేశారు.