Pension Hike | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించారు. మంగళగిరి నియోజకర్గంలోని పెనుమాకలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛను పెంపు ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 65.31లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశారు. పెంచిన పింఛను రూ. 4వేలతో పాటు గత మూడు నెలల బకాయి సొమ్ము కూడా కలిపి ఇచ్చారు. నెలకు రూ. 4వేలతో పాటు అదనంగా రూ.3వేలు కలిపి మొత్తం రూ.7వేలు ప్రభుత్వం పంపిణీ చేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి ఇకపై రూ. 4వేల పింఛను అందనున్నది. దివ్యాంగులకు రూ.3వేల నుంచి రూ.6వేలు చేయగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ.5వేల నుంచి రూ.15వేలు చేస్తూ నిర్ణయం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాకముందే రూ. 4వేల పింఛన్ను అమలు చేయడమే కాదు.. ఏప్రిల్ నుంచే పథకాన్ని వర్తింపచేస్తూ గడిచిన మూడు నెలలకు మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు అందజేశారు. పక్క రాష్ట్రంలో నెల రోజుల్లో ప్రారంభమైతే.. మన రాష్ట్రంలో ఏడు నెలలైనా ఇప్పటికీ ఎన్నికల హామీ అమలు కాకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా పింఛన్లు పెంచకపోవడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్లు రూ.6వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఆరుగ్యారెంటీల్లో భాగంగా డిసెంబర్ 9 నుంచి పెంచిన పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. కానీ 7 నెలలు అవుతున్నా పాత పింఛన్లనే ప్రభుత్వం అమలు చేస్తూ మోసం చేస్తోందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆసరా లబ్ధిదారులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. పింఛన్లు ఇచ్చే నెలలోనే డిసెంబర్ నుంచి పెరిగిన పింఛను బకాయిలను కూడా ఇవ్వాలని కోరుతున్నారు.