అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ హోదాలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయించారు. తర్వాత అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత ప్రమాణం చేశారు. వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలందరితో స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. గంటకు సగటున 25 మంది సభ్యుల ప్రమాణం చొప్పున 7 గంటల పాటు ఈ ప్రక్రియ సాగనుంది. సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే, బీసీ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేయనున్నారు.
అంతకుముందు సభ ప్రాంగనానికి చేరుకున్న సీఎం చంద్రబాబు అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి సభ లోపలికి వచ్చారు. రెండున్నరేండ్ల తర్వాత చంద్రబాబు శాసనసభకు రావడం ఇదే మొదటిసారి. 2021లో సీఎంగానే మళ్లీ సభకు వస్తానని ఆయన శపథం చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మంత్రులు, ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఇక జనసేనాని ఉపముఖ్యమంత్రి హోదాలో శాసనసభకు హాజరయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం ఇదే తొలిసారి.
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను..#PawanKalyanAneNenu pic.twitter.com/6VuChGh5p7
— JanaSena Party (@JanaSenaParty) June 21, 2024