అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్( DSC notification) త్వరలో విడుదల చేస్తుండడంతో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల(Teacher Posts) కు నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల మేనిఫెస్టో(Manifesto) లో ఇచ్చిన హామీ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది.
రెండు, మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు(Chandra Babu) ఈనెల 13న సీఎంగా బాధ్యతలు చేపట్టి డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు.
మెగా డీఎస్సీలో పోస్టులు
మెగా డీఎస్సీలో 16,347 పోస్టులను ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది. అందులో ఎస్జీటీ(SGT) 6,371, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, పీఈటీ 132, ప్రిన్సిపల్స్ 52 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారికి ఒక డీఎస్సీ నోటిఫికేషన్, ఇప్పటి వరకు టెట్ అర్హత సాధించనివారికి టెట్తో పాటు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది .