అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన మహిళల (Womens Missing) జాడ కోసం క్యాబినేట్లో చర్చించి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పుతామని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యం కావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఓ కుటుంబం తనకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు 48 గంటల్లో మహిళా జమ్ము(Jammu) లో ఉందని గుర్తించిన పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. పోలీసులు తీసుకున్న చర్యల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు.
పోలీసులు తలుచుకుంటే కొంత సత్ఫలితాలు సాధిస్తారని, ఏపీ పోలీసుల(Police) పై ఆ నమ్మకం ఉందని అన్నారు. గత ఐదేండ్ల వైసీపీ పాలనలో అనేక మంది తల్లులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖలో సిబ్బంది కొరత ఉందని వాటిని భర్తీ చేయడంపై చర్చ జరుగాలని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. కోతకు గురైన ఉప్పాడ సముద్ర తీరాన్ని సందర్శిస్తానని అన్నారు.