అమరావతి : ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా పోలవరం ప్రాజెక్టు 2025నాటికైనా పూర్తవుతుందని నమ్మకం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (Raghavulu) అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పోలవరం (Polavaram) నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ( Ap Government) పై ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ముంపు గ్రామాలపై తక్షణమే స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలవరం ముంపు బాధిత కుటుంబాలు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కి కూర్చుంటారని హెచ్చరించారు. తక్షణమే అఖిలపక్షం (Political Parties Meeting ) సమావేశం ఏర్పాటు చేసి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు ఏమి చేయాలో చర్చించాలని సూచించారు. కేంద్రం పోలవరానికి నిధులివ్వడం లేదని ఆరోపించారు.
ప్రాజెక్టుకు రూ.56 వేల కోట్లు ఖర్చు అవుతుంటే కేవలం రూ.14వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రూ.10వేల కోట్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ ( AP CM Jagan) పోలవరం బాధితుల పక్షాన ఉంటారో, కాంట్రాక్టర్ల పక్షాన ఉంటారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.