Srisailam | ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి ప్రఖ్యాత ప్రవాచకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే ప్రవచనాల కార్యక్రమాన్ని శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఏర్పాటు చేసింది. గణేశ గాథలు అనే అంశంపై ఈ ప్రవచనాలు జరగనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు జరిగే ఈ ప్రవచనాలు సెప్టెంబర్ 1వ తేదీతో ముగియనున్నాయి.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ పలు పురాణాల్లోని గణపతి ఆవిర్భావ గాథలు, గణపతి తత్తం, గణపతి స్వరూపంలోని అంతరార్థాలు, గణపతి మహిమా విశేషాలు, మొదలైన అంశాలను తెలియజేయనున్నారు.
ప్రవచనాల్లో సందర్భానుసారంగా శ్రీశైల క్షేత్ర మహిమా విశేషాలను కూడా వివరిస్తారు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రవచనాలను విని తరించాల్సిందిగా ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.