రంగారెడ్డి : షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Incident) లో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు(Medical treatment ) అందించాలని సూచించారు. ప్రమాద స్థలంలో ఉన్న కలెక్టర్, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో ఫర్నస్ పేలడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అగ్నికీలల ధాటికి ఆరుగురు మృతి చెందగా, దాదాపు 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధిత కార్మికులంతా ఉత్తర ప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు.