విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల వేలం వ్యవహారం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే లేపింది. చీరల సేకరణ, వేలం నిర్వహణలో పలు అవకతవకాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాజీ ఈవో భ్రమరాంబ నుంచి రూ.2 కోట్లు రికవరీ చేయాలని ఆదేశించారు.
బెజవాడ దుర్గ గుడిలో చీరల వేలం విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడిట్ జరిపారు. ఇందులో 2021-23 మధ్య చీరల వేలంలో రూ.2 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఈవో భ్రమరాంబ పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీని కారణంగా పట్టు చీరల వేలం, బార్ కోడ్ ట్యాగింగ్లో అవకతవకలు జరిగాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భ్రమరాంబ నుంచి రూ.2కోట్లు రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
పట్టు చీరల వేలం విషయంలో పలు అవకతవకలు జరుగుతున్నాయని కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి సీఎంవోకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను అదే చీరల కౌంటర్లో పనిచేశానని చెప్పిన అతను.. అప్పుడు 17 నెలలకుగానూ సుమారు రూ.12 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 2018 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2019 ఆగస్టు 31 వరకు చీరల విక్రయం ద్వారా రూ.6.45కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. దీన్ని అప్పుడు దేవస్థానానికే జమ చేశానని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2 కోట్ల విలువైన సుమారు 2వేల పట్టు చీరలను, రూ.2.90 కోట్ల విలువైన 41వేల సాధారణ చీరలను, రూ.18 లక్షల విలువైన 31వేల రవికలను దేవస్థానానికి జమ చేశానని.. అలాగే మరో కోటి రూపాయల విలువైన చీరలను గుడి అవసరాల కోసం అప్పగించానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే 2019-20లో కొవిడ్ కారణంగా చీరల కౌంటర్ అమ్మకాలు తక్కువగా ఉన్నాయనే సాకు చూపించి, 2021-23కు సంబంధించి అతి తక్కువ ధరకే చీరల కౌంటర్ కాంట్రాక్ట్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆ ఫిర్యాదులో సదరు వ్యక్తి తెలిపారు. చీరల కౌంటర్ ద్వారా రెండేళ్లకు సుమారు రూ.16 కోట్ల ఆదాయం సమకూరుతుందని.. కానీ ఏడాదికి 3.30 కోట్లకే కాంట్రాక్ట్ను కట్టబెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.