అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రి ( Indrakiladri) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జులై 6 నుంచి సారె మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు (EO Ramarao) తెలిపారు. ఆదివారం ఆలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలరోజులపాటు జరుగనున్న ఆషాడమాస సారె ఉత్సవాల్లో భక్తులు సారె సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు .
జులై 19 నుంచి ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు శాకాంబరి దేవి ఉత్సవాలను (Shakambari Devi festival) నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈసారి తొలిసారిగా వారాహి ఉత్సవాలను నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జులై 6 నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు, జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాల సమర్పణ చేస్తామన్నారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలను ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిలిపివేస్తామని ప్రకటించారు.